Saturday, 27 October 2018
Mulching
మల్చింగ్తో మిర్చి సాగు
20-10-2018 01:23:29
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి కరువు పరిస్థితుల్లో కూడా మిర్చి సాగు ద్వారా సిరులు పండిస్తున్నారు ప్రకాశం జిల్లా కొత్తరెడ్డిపాలెం రైతులు. డ్రిప్తో పాటు మల్చింగ్ షీట్ ఉపయోగించి నీటిని, ఎరువులను, కూలీల ఖర్చును ఆదా చేసుకుని లాభాల పెంచుకుంటున్నారు.
కరువు పరిస్థితుల్లోనూ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం రైతులు సిరులు పండిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్తరెడ్డిపాలెంలో 150 కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా బోరుబావుల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ బోర్లకు సరిగ్గా నీరు రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో డ్రిప్ ద్వారా నీటితడులు ఇవ్వడం ప్రారంభించారు.
అన్ని పంటలకు డ్రిప్ పద్ధతిలోనే నీటితడులు ఇస్తూ నీటిని ఆదా చేసుకుంటున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి మిర్చిని కూడా డ్రిప్ పద్ధతిలోనే సాగు చేయడం ఇక్కడి రైతుల ప్రత్యేకత. ఈ గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు ఇంకో అడుగు ముందుకేసి మల్చింగ్ పేపర్ను కూడా వినియోగిస్తూ నీటిని, ఎరువులను మరింత ఆదా చేసుకుంటున్నారు. మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగు చేస్తే నేలలో తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. తక్కువ నీటితోనే పంటను సాగు చేసుకోవచ్చు.
80 శాతం నీరు ఆదా
డ్రిప్, మల్చింగ్ విధానాల ద్వారా తక్కువ నీటితో ఈ ప్రాంత రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. సాధారణంగా ఒక ఎకరాకు వినియోగించే నీటితో నాలుగైదు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్ విధానం వల్ల నీరు ఆదా కావడంతో పాటు కలుపు బెడద తగ్గుతుంది. నీరు మొక్కల వద్ద మాత్రమే పడటం వలన కలుపు వచ్చే అవకాశం ఉండదు. దీంతో కూలీల ఖర్చు తగ్గుతున్నది. అలానే ఎరువులను డ్రిప్ ద్వారా పంపించడం వల్ల ఎరువు ఆదా అవుతున్నది. మల్చింగ్ పేపర్ వినియోగం ద్వారా కలుపు మొక్కలు రాకుండా ఉండటంతో పాటు తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. మొక్కలకు ఎరువు సరిగా అందడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ఆ గ్రామ రైతులు.
నాలుగింతల పొలానికి తడులు
డ్రిప్ ద్వారా ఎకరాకు ఉపయోగించే నీటితో 4 ఎకరాలకు నీటిని అందిస్తున్నాం. బోర్లలో నీరు లేదు. ఈ పరిస్థితుల్లో డ్రిప్ లేకపోతే సేద్యం మానుకోవాల్సి వచ్చేది. మూడేళ్లుగా డ్రిప్ పద్ధతిలోనే మిర్చి సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవటంతో డ్రిప్ రంధ్రాల వద్ద పడ్డ నీటి తేమలోనే మొక్కలు నాటుతున్నాం. మామూలుగా ఎకరాకు 40 బస్తాల ఎరువులు వినియోగిస్తుంటాం. డ్రిప్ ద్వారా 7 బస్తాలు సరిపోతుంది. ఎరువులు, కలుపు ఖర్చులు సగానికి పైగా తగ్గి లాభాలు పెరుగుతున్నాయి. మల్చింగ్ పేపర్ వినియోగించడం ద్వారా తేమ ఎక్కువ రోజులు ఉంటున్నది. కలుపు బెడద తప్పింది.
- కె. నాగిరెడ్డి, చింతా వెంకటరామిరెడ్డి, సంగు శ్రీలక్ష్మి, కొత్తరెడ్డిపాలెం
ప్రతి చుక్కా సద్వినియోగం
కొత్తరెడ్డిపాలెంలో రైతులందరూ డ్రిప్ ద్వారా పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మల్చింగ్ పేపరు ఉపయోగించి నీరు, ఎరువులు ఆదా చేస్తూ మిర్చి సాగు చేస్తున్నారు.
- నవీన్కుమార్, ఉద్యానశాఖ అధికారి, అద్దంకి
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అద్దంకి
zbnf reddy ananathapur
ఉద్యాన రైతుగా ఐటీ కంపెనీ బాస్ https://kalpatharuorganics.com/news
20-10-2018 00:54:28
జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ ఎరువులతో సాగు...మేళా, వెబ్సైట్ ద్వారా పండ్ల విక్రయం
అనంతపురం జిల్లాకు చెందిన ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. ఆయన భార్య ఒక ఆర్గానిక్ కంపెనీ సారథి, ఇంజనీరింగ్ చదువుతున్న వారి కుమార్తెతో కలిసి కారులో ప్రయాణం చేస్తూ రోడ్డు వెంట పంట నూర్పిడి చేస్తున్న రైతుల్ని చూశారు. దేశంలో మిగిలిన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుండగా వ్యవసాయం మాత్రం ఎందుకు సాంకేతికంగా వెనుకబడి వుందనే కూతురు ప్రశ్న ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతలో ఆలోచనలు రేకెత్తించింది. ఆ కుటుంబం అడుగులు వ్యవసాయం వైపు పడేలా చేసింది. కరువులో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆదుకునేలా చేసింది. నగరంలో ఉద్యోగాలు చేసుకుంటూనే తీరిక వేళల్లో స్వగ్రామంలో బంధువుల సహకారంతో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నదీ కుటుంబం.
వివిధ రకాల పంటలతో పాటు అరుదైన పండ్లతోటలు పెంచి ఆంధ్రా మామిడిపండ్లను ఆన్లైన్ ద్వారా విక్రయించి, ఒకటికి ఐదు రెట్ల లాభాలను గడిస్తున్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం రాగిమేకలపల్లికి చెందిన మసుకోట రాజశేఖర్ రెడ్డి వ్యాల్యూపాయింట్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. భార్య విజయ లక్ష్మి ఓ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. కుమార్తె పూజిత ఇంజనీరింగ్ చదువు తోంది. రాజశేఖర్రెడ్డి వృత్తిరీత్యా గత 20 ఏళ్లలో అమెరికా, ఐరోపా, ఆస్ర్టేలియా, ఆసియా ఖండాలలో పర్యటించి అపార అనుభవాన్ని గడించారు. సొంత జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు గమనించి, కుమార్తె మాటలతో స్ఫూర్తి పొందిన ఆయన 2009లో వ్యవసాయం ప్రారంభించారు.
రాగిమేకలపల్లి వద్ద 47 ఎకరాల పొలం ఉండగా మొదట 15 ఎకరాల్లో పండ్లతోటలు, చిరుధాన్య పంటలైన సామలు, కొర్రలు, ఉలవలు, అలసందలు సాగు చేశారు. మామిడిలో 11 రకాల చెట్లతో ప్రారంభించి ప్రస్తుతం తోటలో 28 రకాల పండ్ల చెట్లను సాగుచేస్తున్నారు. రెండువేల మామిడి మొక్కల్లో రత్నగిరి ఆల్ఫాన్స్ బెంగళూరు అగ్రికల్చర్ యూనవర్సిటీ నుంచి, కేసర్, ఇమాం పసంద్, తదితర రకాల చెట్లను రాజమండ్రి నుంచి తెప్పించారు. వాటితోపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి గాను ఆరెంజ్, అవకాడొ, బ్రెడ్ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, మ్యాంగో స్టీమ్, రోజ్ ఆపిల్, గోడంబి, రామాఫలం, జాక్ఫ్రూట్, చెర్రీస్, ఉసరి, పనస, అల్లనేరేడు తదితర రకాలు పెట్టారు. పొలంచుట్టూ ట్రెంచ్ ఏర్పాటుచేసి అవసరమైన చోట ఫారంపాండ్, చెక్డ్యామ్లు, గట్లు ఏర్పాటుచేశారు. వర్షం పడినప్పుడు నేలపై పడే ప్రతి చినుకూ భూమిలో ఇంకేలా చేశారు. ఇలా చేయడం ద్వారా ఒకే బోరుతో 15 ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగుచేస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తారు.
ఆస్ర్టేలియా, జర్మనీకి చెందిన నిపుణుల వద్ద ఎరువుల తయారీలో ఏడు రోజులు శిక్షణ పొందారు రాజశేఖర్రెడ్డి. జర్మన్ పద్ధతిలో తయారుచేసుకున్న మిశ్రమంతో పాటు సేంద్రియ ఎరువులతోనే అన్ని పంటలూ పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడికాయలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయించడం వల్ల రూ.15 లక్షల లాభాలు సాధించారు. ఇందుకోసం దంపతులిద్దరు బెంగళూరులో అపార్ట్మెంట్ల వద్ద మేళా ఏర్పాటుచేశారు. ఆంరఽధా పండ్లకు గిరాకీ పెరగడంతో ప్రత్యేకంగా వెబ్సైట్లో ఆంధ్రమ్యాంగో డాట్కామ్, కల్పతరువు ఆర్గానిక్స్ పేరుతో తమ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా ప్రత్యేక బాక్సుల్లో సరఫరా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తోటలో కిలో రూ.25 ధర పలికే మామిడిపండ్లకు రూ.150 లభించింది. వీరి వినూత్న సాగు పట్ల ఆకర్షితులైన పలువురు బడా కంపెనీ ఉద్యోగులు వారు కూడా గ్రామాలకు వెళ్లి పంటలు సాగు చేయడానికి సిద్ధం కావడం విశేషం.
స్వగ్రామంలో ప్రకృతి వైద్యశాల
ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని వ్యవసాయాభివృద్ధికి ఎలా ఉపయోగించాలనే అంశంపై ఐక్యరాజ్యసమితి కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాను. వ్యవసాయ క్షేత్రాన్ని విద్యార్థులు, రైతులకు స్ఫూర్తినిచ్చే రీతిలో తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. జర్మన్ పద్ధతిలో తయారుచేసే ఎరువును స్థానిక రైతులకు తక్కువ ధరకు విక్రయించాలని ఆలోచిస్తున్నాను. త్వరలో రాగిమేకల వద్ద ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయాలన్నది నా లక్ష్యం. పండ్ల మొక్కల నర్సరీ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తాం. విద్యార్థులు తాను ఇచ్చిన మొక్కలను పెంచి ఫలాలను తెచ్చి చూపిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తాను.
- రాజశేఖర్రెddy
Money Dharmam
ధర్మ మహిమ - చక్వవేణ మహారాజు కధ
----------------------------------------
“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”
వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది,
సమంగా ఉంటే బంగారం పండుతుంది,
అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.
ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...
తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !
*అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.*
ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు.
*మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!*
పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు.
అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.
*ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన ఉత్సవానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.*
వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.
రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు,
కానీ, తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.
తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.
మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు.
ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది.
ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, *‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘* అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, *‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’* అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది.
తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.
‘చూసారా స్వామి ! ఇదీ *చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’* అంది, మండోదరి.
‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.
చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, *ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’* అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. *‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి.* హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.
మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది.
ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది.
అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగలది ధర్మవర్తనం
నీతి : *క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది.*
అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.
మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.
దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే మనది అవుతుంది !
ఇది సత్యం !
ఇదే వైష్ణవ మత సిద్ధాంతం !!
Friday, 12 October 2018
Green leaves
నిన్న మార్కెట్ లో తెల్లగలిజేరు ఆకు కొన్నాక '' ప్రతివారం గలిజేరు ని మాత్రం వదలకుండా అడుగుతారెందుకు ''అన్నది అమ్మే అమ్మాయి.
రెట్టించిన ఉత్సాహం తో,ఆవేశంతో వర్షం పడుతున్నా పట్టించుకోకుండా గలిజేరు కధ చెప్పి వచ్చాను .''ఈ గుణాలన్నీ విన్నాక రేపటి నుండి దీని ధర మాత్రం పెంచేయకు'' అన్నాను చివర :-)
పక్కన ఉండి ఇదంతా విన్నావిడ , ''ఇవన్నీ ముందే తెలిస్తే ఈమెకి మిమ్మల్ని ఈ సంగతులు చెప్పనిచ్చేదాన్ని కాదు ఎందుకంటే సాటి మనిషి అవసరానికి సాయపడే లక్షణం తగ్గి వ్యాపారం చేసుకునే లక్షణం ఈ కాలపు మనుషులకి పెరిగింది కదా అందుకని ''అన్నది నవ్వుతూ .
మొక్క గురించి నేను చదివిన,విన్న, తెలిసిన నాలుగు విషయాలు ..
వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు . కొన్ని మూలికల గురించి చదువుతూంటే భగవంతుడు ఎంత దయామయుడు అనిపిస్తుంది . అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని , ఔషధాలను అతి దగ్గరగా , సులువుగా , చవకగా ఉంచినందుకు . ప్రకృతిని నాశనం చేస్తూన్న మనిషికి తనని తాను నాశనం చేసుకుంటున్నాడన్న స్పృహ ఎప్పుడు కలుగుతుందో అనిపిస్తుంది . ఆరోగ్యం లేని ధనం , జీవితం , ఆయుష్షు ఎవరికి, ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి .
మన మొక్క విషయానికి వస్తే ,దీన్ని పునర్నవ అని కూడా అంటారు . ఆయుర్వేద మందుల్లో anti inflammatory గా , anti oedema (ఒంట్లో నీరు చేరటం ) ముందుగా వాడే పునర్నవాసవం , రక్తాన్ని వృద్ది పరచటానికి వాడే పునర్నవ మండూరం తయారు చేసేది ఈ మొక్కతోనే .
వర్షాభూ అని కూడా అంటారు . వర్షా కాలం లో మొలిచేది కాబట్టి .ఇంగ్లీష్ లో boerhavia diffusa .నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు.తెలుపు , ఎరుపు , నలుపు. ఔషధ గుణాలు మూడింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు .వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు.
తెల్ల గలిజేరు వేడి చేసి , కఫము ,దగ్గు ,విషము ,హృద్రోగాలను ,పాండు రోగాలు , శరీరానికి కలిగే వాపులు , వాత వ్యాధులు , కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది . లివర్ వాపు ని , గుండె బలహీనత వల్ల వఛ్చిన వాపుని పోగొడుతుంది . కిడ్నీ లను బాగు చేసి సక్రమం గా పని చేసేలా చేస్తుంది . బాగా ముదిరిన ఈ మొక్క వేరులను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి చేసి బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి , పాండు రోగము , శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి , వాతము , కఫము , ఉబ్బు పోగొడుతుంది .
నెల రోజులు తింటే కుష్ఠుని కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది . ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి , కంటి చూపు మెరుగు పడుతుంది . ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది . ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం , సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి . అలా మూడు రోజులు తినాలి .
ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి . గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి , వాతం నొప్పులున్న చోట , కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి . నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు . గలిజేరు ఆకు రసం తీసి సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి ఉంచాలి . రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగితే గుండె దడ , గుండె బలహీనత తగ్గుతాయంటారు
శరీరాన్ని detoxify చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది . శరీరం లో యూరియా లెవెల్స్ ని తగ్గిస్తుంది . diuretic గా పని చేస్తుంది . గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది .
ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది . నల్ల గలిజేరు కారం , చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది . ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె .
పప్పులో కలిపి వండుకుంటారు , ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండి లో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు . ఆకుల తో కషాయం చేసి తాగుతారు . ఈ కషాయం లో కొద్దీ గా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది .
తెల్ల గలిజేరు వేరు , ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది.
తెల్లగలిజేరు వేరు , నీరు , పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది .
ఈ ఆకు కూరని అతిగా తినకూడదు . తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి .diabetes , అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధికం గా తింటూ ఈ ఆకు కూరని మితం గా తినాలి . ఈ ఆకుతో చేసిన మందులు మాత్రం పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే వాడాలి . lactating తల్లులు , గర్భిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలం లో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది . చాలా త్వరగా కిడ్నీ ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే 'పునర్నవ' అయ్యింది
పొలాల నిండా ఉంటుంది,కాలువ గట్లు మీద,బీడు భూముల్లో దొరుకుతుంది...ప్రయత్నించండి,తప్పకుండా దొరుకుతుంది...
దీనిని అటుకమామిడి అనికూడాపిలుస్తారుగా
Subscribe to:
Posts (Atom)