Saturday, 27 October 2018
Mulching
మల్చింగ్తో మిర్చి సాగు
20-10-2018 01:23:29
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి కరువు పరిస్థితుల్లో కూడా మిర్చి సాగు ద్వారా సిరులు పండిస్తున్నారు ప్రకాశం జిల్లా కొత్తరెడ్డిపాలెం రైతులు. డ్రిప్తో పాటు మల్చింగ్ షీట్ ఉపయోగించి నీటిని, ఎరువులను, కూలీల ఖర్చును ఆదా చేసుకుని లాభాల పెంచుకుంటున్నారు.
కరువు పరిస్థితుల్లోనూ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం రైతులు సిరులు పండిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్తరెడ్డిపాలెంలో 150 కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా బోరుబావుల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ బోర్లకు సరిగ్గా నీరు రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో డ్రిప్ ద్వారా నీటితడులు ఇవ్వడం ప్రారంభించారు.
అన్ని పంటలకు డ్రిప్ పద్ధతిలోనే నీటితడులు ఇస్తూ నీటిని ఆదా చేసుకుంటున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి మిర్చిని కూడా డ్రిప్ పద్ధతిలోనే సాగు చేయడం ఇక్కడి రైతుల ప్రత్యేకత. ఈ గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు ఇంకో అడుగు ముందుకేసి మల్చింగ్ పేపర్ను కూడా వినియోగిస్తూ నీటిని, ఎరువులను మరింత ఆదా చేసుకుంటున్నారు. మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగు చేస్తే నేలలో తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. తక్కువ నీటితోనే పంటను సాగు చేసుకోవచ్చు.
80 శాతం నీరు ఆదా
డ్రిప్, మల్చింగ్ విధానాల ద్వారా తక్కువ నీటితో ఈ ప్రాంత రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. సాధారణంగా ఒక ఎకరాకు వినియోగించే నీటితో నాలుగైదు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్ విధానం వల్ల నీరు ఆదా కావడంతో పాటు కలుపు బెడద తగ్గుతుంది. నీరు మొక్కల వద్ద మాత్రమే పడటం వలన కలుపు వచ్చే అవకాశం ఉండదు. దీంతో కూలీల ఖర్చు తగ్గుతున్నది. అలానే ఎరువులను డ్రిప్ ద్వారా పంపించడం వల్ల ఎరువు ఆదా అవుతున్నది. మల్చింగ్ పేపర్ వినియోగం ద్వారా కలుపు మొక్కలు రాకుండా ఉండటంతో పాటు తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. మొక్కలకు ఎరువు సరిగా అందడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ఆ గ్రామ రైతులు.
నాలుగింతల పొలానికి తడులు
డ్రిప్ ద్వారా ఎకరాకు ఉపయోగించే నీటితో 4 ఎకరాలకు నీటిని అందిస్తున్నాం. బోర్లలో నీరు లేదు. ఈ పరిస్థితుల్లో డ్రిప్ లేకపోతే సేద్యం మానుకోవాల్సి వచ్చేది. మూడేళ్లుగా డ్రిప్ పద్ధతిలోనే మిర్చి సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవటంతో డ్రిప్ రంధ్రాల వద్ద పడ్డ నీటి తేమలోనే మొక్కలు నాటుతున్నాం. మామూలుగా ఎకరాకు 40 బస్తాల ఎరువులు వినియోగిస్తుంటాం. డ్రిప్ ద్వారా 7 బస్తాలు సరిపోతుంది. ఎరువులు, కలుపు ఖర్చులు సగానికి పైగా తగ్గి లాభాలు పెరుగుతున్నాయి. మల్చింగ్ పేపర్ వినియోగించడం ద్వారా తేమ ఎక్కువ రోజులు ఉంటున్నది. కలుపు బెడద తప్పింది.
- కె. నాగిరెడ్డి, చింతా వెంకటరామిరెడ్డి, సంగు శ్రీలక్ష్మి, కొత్తరెడ్డిపాలెం
ప్రతి చుక్కా సద్వినియోగం
కొత్తరెడ్డిపాలెంలో రైతులందరూ డ్రిప్ ద్వారా పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మల్చింగ్ పేపరు ఉపయోగించి నీరు, ఎరువులు ఆదా చేస్తూ మిర్చి సాగు చేస్తున్నారు.
- నవీన్కుమార్, ఉద్యానశాఖ అధికారి, అద్దంకి
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అద్దంకి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment